సత్తెనపల్లి: టీడీపీ పాలనలో నియోజకవర్గంలో అరాచక పర్వం కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల అండదండలతో యథేచ్ఛగా సాగుతున్న పేకాట క్లబ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్గా మారింది. దీనిపై డాక్టర్ గజ్జల ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులోని వివరాల మేరకు... పేకాట క్లబ్ నడుస్తున్న తీరును పక్కా ఆధారాలతో అధికారుల ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. బహిరంగంగానే పేకాట క్లబ్లు నడుపుతుంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. జూదానికి బానిసలై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. గంజాయి మత్తుకు యువత బలవుతోందని పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులతో వారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా చర్యలు తీసుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని నిలదీశారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. పేకాట అడ్డాలను మూసివేసి, గంజాయి ముఠాలను వెంటనే అణచివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


