
శాంతిభద్రతల కోసమే విస్తృత తనిఖీలు
నరసరావుపేట: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా వివిధ హోటళ్లు, లాడ్జిలలో శనివారం అర్ధరాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలతో పాటు హోటళ్లు, లాడ్జీల లాగ్బుక్లను పరిశీలించారు. గుర్తింపు పత్రాల నమోదు, విధానం తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని లాడ్జి యాజమానులకు స్పష్టమైన సూచనలు చేశారు. పరారీలో ఉన్న నిందితులు, అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయని ఎస్పీ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలను మరింత కఠినంగా కొనసాగించనున్నామని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.