అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సన్నిహితులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈఓ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మ, సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు, ఆలయ పాలక మండలి సభ్యుడు కొయ్యాన రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం స్వామివారికి రూ.3,67,944 మేర ఆదాయం లభించిందని ఈఓ ప్రకటించారు.
జిల్లా రెడ్క్రాస్కు పురస్కారం
శ్రీకాకుళం కల్చరల్: విజయవాడలో నిర్వహించిన ‘ది ఫిఫ్త్ ఇన్సైట్ యాన్యువల్ గ్యాదరింగ్‘ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖకు ఉత్తమ ప్రశంసా పురస్కారం లభించింది. మానోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ భూపతిరాజు రామకృష్ణంరాజు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ అధ్యక్షుడు వై.డి.రామారావు అవార్డు అందజేశారని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు తెలిపారు. రెడ్క్రాస్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం వచ్చిందన్నారు.
కోచింగ్ సెంటర్ల నమోదు తప్పనిసరి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పోటీపరీక్షలకు, విద్యార్థుల ట్యూషన్ కోసం శిక్షణ అందిస్తున్న కోచింగ్ అకాడమీలు/శిక్షణా సంస్థలు తక్షణమే కోచింగ్ ఇన్స్టిట్యూట్ రెగ్యులేషన్ అండ్ మోనిటరంగ్ సిస్టమ్ (సీఐఆర్ఎంఎస్)లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ/జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలు, ఏపీ విద్యా చట్టం 1982 నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోటీపరీక్షలు, ట్యూషన్, కోచింగ్, గైడెన్స్, విద్యాపరమైన సహాయాన్ని అందిస్తూ 50 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు అందిస్తున్న అన్ని కోచింగ్ సంస్థలు తప్పనిసరిగా సీఐఆర్ఎంఎస్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి 9440816001 నంబర్ను సంప్రదించాలని కోరారు.
యువకులను క్షేమంగా తీసుకొస్తాం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : మలేషియాలో చిక్కుకున్న సిక్కోలు యువకులను స్వస్థలాలకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. సోంపేట మండలం ఎర్ర ముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయి వంశీ, సిరిమామిడి గ్రామానికి చెందిన గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్లు మలేషియాలో చిక్కుకున్నారు. శారి కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీకాకుళంలోని మంత్రిని క్యాంపు కార్యాలయంలో సమస్య వివరించారు. మంత్రిని కలసిన వారిలో మత్స్యకార నాయకులు సూరాడ చంద్రమోహన్, అశోక్, రాజు, దుర్గారావు, అఖిల్ తదితరులు ఉన్నారు.
ఛాయరాజ్ రచనలు స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం: ఛాయరాజ్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, వర్తమాన సామాజిక సంక్షోభాలకి పరిష్కారాలు ఛాయరాజ్ కవిత్వంలో లభిస్తాయని జనసాహితి జిల్లా అధ్యక్షుడు టి.శోభన్బాబు అన్నారు. శ్రీకాకుళంలోని ఓ కల్యాణమండపంలో జనసాహితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజా సాహిత్య, సాంస్కృతికోద్యమ కవి ఛాయరాజ్ 13వ వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మాతృభాష మాధ్యమానికి, ప్రజల భాషకు సంఘీభావంగా ఛాయరాజ్ రాసిన మృతృభాష కవితను చదివి వినిపించారు. ఛాయరాజ్ శ్రీకాకుళంపైన ప్రచురించిన అదిగోరా తూరుపు పుస్తకాన్ని రైతు కూలీ సంఘం నాయకురాలు తాండ్ర అరుణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.నాగరాజు, ప్రధాన కార్యదర్శులు ఎ.సురేష్, శివాజీ, పి.మోహనరావులు, కె.పాపారావు, శ్రీనివాసరావు, కె,.భానుమూర్తి, ప్రభాకరరావు, అప్పలనాయుడు, రచయితలు, కవులు, సాహితీత్తలు తదితరులు పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ చేస్తున్న దృశ్యం


