రాయగడ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాయగడ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు చిత్రసేన్ పాలకను దోషిగా నిర్ధారిస్తు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమాన విధించింది. జరిమాన చెల్లించలేని పక్షంలో అదనంగా మరో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. అలాగే బాధితురాలికి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసును విచారించిన ఏడీజే కమ్ స్పెషల్ జడ్జి సంజీవ్ కుమార్ బెహర ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2023 ఫిబ్రవరి 23వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై నిందితుడు పాలక అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి చిత్రసేన్ పాలకాను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 29 మంది సాక్షుల్లో 28 మంది సాక్షుల వాగ్మూలాలను పరిశీలించిన కోర్టు ఈ మేరకు దోషిగా నిర్ధారిస్తు తీర్పును వెల్లడించింది.


