● ఐదుగురు దుర్మరణం
భువనేశ్వర్: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయి విషాదం చోటు చేసుకుంది. ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో 5 మంది దుర్మరణం పాలయ్యారు. అదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. బుధవారం రాత్రి ఢెంకనాల్ జిల్లా ఛొతియా గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బంగూరసింగ్ గ్రామానికి చెందిన 7 మంది స్నేహితులు పెళ్లి కొడుకు తరఫున పెళ్లి జరుగుతున్న ఇందిపూర్ గ్రామానికి కారులో వెళ్లారు. వేడుకలో పాల్గొన్న తర్వాత వారు రాత్రి పొద్దు పోయాక ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఛొతియా గ్రామం సమీపంలో కారు అకస్మాత్తుగా అదుపు తప్పి చెరువులో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రయాణికులు బబ్లూ, శిబు కారు తలుపును పగల గొట్టి ఈదుకుంటూ సురక్షితంగా చెరువు గట్టుకు చేరారు. స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి జనం చేరి నీట మునిగిన వాహనం నుంచి మిగిలిన ఐదుగురు ప్రయాణికులను బయటకు తీశారు. వారిని రక్షించే సమయానికే వారు అంతా మరణించారు. మృతులను చంద్రకాంత్ స్వంయి (డ్రైవర్), అబినాష్ సాహు, రాకేష్ సాహు, శ్రీరామ్ సాహు మరియు అభిజిత్ సాహుగా గుర్తించారు. ఢెంకనాల్ సదర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. వెలికి తీసిన మృత దేహాలను పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపించారు.


