కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో విద్యార్థి లోకం భగ్గుమంటోంది. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని చమిరియాగుడ నుంచి ర్యాలీలో పాల్గొనడానికి రావాలని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఇది సామాన్య ర్యాలీగానే ప్రజలు భావించారు. న్యూఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావ ర్యాలీగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి కొద్దికొద్దిగా విద్యార్థులు చేరుకున్నారు. పోలీసులు కూడా కొద్ది మందే వచ్చారు. విద్యార్థుల సంఖ్య రానురాను భారీగా పెరిగింది. దీంతో పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించారు. విద్యార్థులతో చర్చలు జరిపి ప్రశాంతంగా ర్యాలీ జరపడానికి నిర్ణయించారు. నీట్ పరీక్ష లీకేజి తో సంబంధం ఉన్న రాష్ట్రానికి చెందిన కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై దాడి చేసిన ఘటన పై న్యాయ విచారణ జరపాలని, వాంగ్ చుక్ జీవిత భద్రత కేంద్రానిదే అని నినాదాలు చేశారు. కొన్ని చోట్ల విద్యార్థులు ఆగ్రహాలకు గురైనప్పటికీ పోలీసులు నచ్చజెప్పారు. పార్టీలకు అతీతంగా ర్యాలీ జరగడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెర వెనుక ఉండి పరిశీలించారు. ఈ ర్యాలీ సుమారు 4 కిలోమీటర్ల దూరం కలక్టరేట్ జంక్షన్ వరకు సాగింది. అక్కడ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్ర పటాన్ని అవమానించారు. ఊహించని విదంగా వేల సంఖ్యలో విద్యార్థులు రావడంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
కొరాపుట్లో..
కొరాపుట్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేశారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ వలన రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసి ఒడిశా పేరు ప్రతిష్టలు పోకుండా చూడాలని హితవు పలికారు. కొరాపుట్,నబరంగ్పూర్ జిల్లాలలో కాంగ్రేస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి.


