పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశుమందిర్లో ఆదివారం ప్రధాన ఆచార్యుల రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పుల్భానీ, గంజాం, గజపతి జిల్లాల నుంచి సరస్వతీ శిశు మందిర్ అంతర్భాగ ప్రధానాచార్యులు 72 మంది పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆర్థిక పథకం, జాతీయ విద్యావిధానంపై పలువురు చర్చించారు. ముఖ్యఅతిథిగా సుభాష్ జమాదార్ హాజరవ్వగా.. దక్షిణమండలం నుంచి ప్రకాష్చంద్ర త్రిపాఠి, గౌరంగో పాణిగ్రాహి, దేవీ మఠం మహాంత రామానంద దాస్, శిక్షవికాస్ సమితి ప్రాంతీయ సంచాలకులు అశ్వినీ కుమార్ నాయక్, ఖగేశ్వర్ దాస్, పుల్భానీ, గంజాం కోఆర్డినేటర్లు పద్మనాభ సామల్, సరోజ్ పట్నాయక్లు ప్రసంగించారు. కార్యక్రమాన్ని సరస్వతీ శిశు మందిర్ ప్రధాన అచార్యులు సరోజ్పండా పర్యవేక్షించారు.
విద్యార్థులకు బంపర్ ఆఫర్
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తర గతి విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం ఎ.గోవిందరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పబ్లిక్ పరీక్షలో పదో తరగతి విద్యార్థులు 590 మార్క్లు సాధిస్తే.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను తన సొంత ఖర్చులతో విమానంపై హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడి ప్రసిద్ధ ప్రాంతాలను చూపిస్తామన్నారు. తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే తీసుకు వస్తానని హెచ్ఎం ప్రకటించారు. తాను ఉద్యోగ విరమణ పొందినంత వరకు ఇలా చేస్తానని పేర్కొన్నారు.
ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అధ్వానం
టెక్కలి: టెక్కలి మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాల, ఆర్సీఎం, ఐజేహెచ్ఎస్, తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్ తదితర పాఠశాలల్లో పదోతరగతి పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 5 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్, ఓపెన్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి సుమారు 993 మంది పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. టెక్కలి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్ర శాలలు మరమ్మతులకు గురి కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఎచ్చెర్లలో 15 సిలిండర్లు సీజ్
ఎచ్చెర్ల: మండల కేంద్రంలో ఉన్న హోటల్స్ను ఆదివారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ఎల్పీజీ 15 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి సీజ్చేశారు. వీరి నుంచి రూ.3,5018 ఆపరాధ రుసుం వసూలు చేశారు. ఇలాంటి సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణం, మండలంలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి 6 పరీక్ష కేంద్రాల్లో 1140 మంది పరీక్షలు రాయనున్నారు. తొగరాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పట్టణంలోని సెయింట్అన్స్, ఎస్వీఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్తో పాటు లక్ష్మినగర్ మున్సిపల్ హైస్కూల్, గేటులోగల మున్సిపల్ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే గేటులోగల మున్సిపల్ హైస్కూల్ను ఇటీవల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడంతో ఆ పాఠశాల తరగతి గదులు ఇరుగ్గా ఉన్నాయి. గదులు ఇరుగ్గా ఉన్నా సరే ఆ పాఠశాలకు 120 మంది విద్యార్థులను కేటాయించారు. బడిలో ఐదు గదులను కేటాయించారు. ఇవి 120 మందికి వినియోగించాలని ఆదేశించారు. ఆ గదుల్లో బెంచీలు వేసేందుకు సరిపోయినన్ని లేకపోవడంతో చింతాడ గ్రామంలోగల మున్సిపల్ హైస్కూల్నుంచి బెంచీలు తీసుకువచ్చి సర్దారు. గదులు చిన్నవిగా ఉండడంతో నిర్వాహకులు తలలు పట్టుకున్నారు.
‘వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం’
శ్రీకాకుళం: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమం ఎంతో కీలకమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమి క స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,462 కేంద్రాల్లో 1,13,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే ‘అక్షర ఆంధ్ర’ యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


