● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క
కొరాపుట్: తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ఆ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క ఆరోపించారు. బెంగుళూరు నుంచి కొరాపుట్ పార్లమెంట్ పరిధిలోని మీడియా ప్రతినిధులకు తన సందేశం పంపించారు. 4వ రాజ్యసభ అభ్యర్థిని కాంగ్రెస్, బీజేడీ పార్టీలు సంయుక్తంగా గెలిపించుకుంటాయన్నారు. తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి తాము బెంగుళూరులో క్యాంప్తో ఉన్నామన్నారు. కానీ బీజేపి మద్దతుతో ఉన్న 4వ అభ్యర్థి దిలీప్ రాయ్ అనుచరులు తమ ఎమ్మెల్యేలను రహస్యంగా సంప్రదించడానికి వచ్చి పట్టుబడ్డారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.5 కోట్లు ఇవ్వడానికి బ్లాంక్ చెక్లు తెచ్చారన్నారు. తమ ఎమ్మెల్యేలు వినకపోతే ఒడిశాలోనికి రానివ్వమని బెదిరించారన్నారు. వారి ఫోన్లలలో దిలిప్రాయ్ పేరు ఉందన్నారు. వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నిందితులలో నలుగురిలో ఇద్దరు అరెస్టయ్యారన్నారు. ఒడిశాకి వచ్చిన తమ ఎమ్మెల్యేకి ఏమైనా జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్చరణ్ మజ్జిదే పూర్తి భాద్యత అని హెచ్చరించారు. రాజకీయాలలో ఇటువంటి పరిణామాలు విచారకరమని ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. ఎంపీ వెంట ఒడిశా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు జెట్టి కుసుం కుమార్ (హైదరాబాద్) ఉన్నారు.
కొరాపుట్దే కీలకం..
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలలో కొరాపుట్దే కీలకమైంది. మొదట ముగ్గురు అభ్యర్థులు బీజేపీ, బీజేడీ సునాయాసంగా గెలుచు కొనునన్నాయి. నాల్గో అభ్యర్థి విషయంలో బీజేపీ ఒకవైపు, బీజేడీ, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. రాష్ట్రంలో కేవలం కొరాపుట్ పార్లమెంటరీ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్కి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ ప్రాంతంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. కొరాపుట్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు.


