కృష్ణలంక(విజయవాడతూర్పు): పని చేసే చోటనే ఓ క్యాషియర్ తన చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.11 లక్షల సంస్థ సొమ్మును కాజేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సారపరెడ్డి సాయికుమార్ నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలో ఉన్న ఓ వస్త్ర షోరూంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ కస్టమర్ తమ క్రెడిట్ బిల్లును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ బ్రాంచ్కు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆ బిల్లును వెరిఫై చేయగా ఆ క్రెడిట్ బిల్లును విజయవాడ బ్రాంచ్లోనే వినియోగించినట్లు చూపిస్తుందని చెప్పారు. అనుమానం వచ్చిన మేనేజర్ పి.బాలకృష్ణ విజయవాడ బ్రాంచ్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా సాయికుమార్ స్వయంగా ఆ క్యాష్ను విత్డ్రా చేసినట్లు కనిపించింది. ఫుటేజీ ఆధారంగా అతడిని పిలిచి ప్రశ్నించగా తాను రూ.31,449లను సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. అంతటా ఆ మొత్తాన్ని షోరూమ్కు చెల్లించి రాతపూర్వకంగా రాసిచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఘటన తర్వాత షోరూం యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా రూ.11 లక్షలకు సంబంధించిన బిల్లులను అదేవిధంగా మోసం చేసి నగదు తీసుకున్నట్లు తేలింది. సంస్థను మోసం చేసిన సాయికుమార్పై చర్యలు తీసుకోవాలని షోరూం మేనేజర్ బాలకృష్ణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాగాయలంక: వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడు కరుణించాలని సంకల్పంతో స్థానిక కృష్ణానది తీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్లో కొలువైన శ్రీరామలింగేశ్వర శివలింగానికి ఆదివారం సహస్ర ఘటాల(1008)తో కృష్ణానదిలోని సముద్రపు జలాలతో భక్తులు విశేష అభిషేకం నిర్వహించారు. ప్రసన్న గణ పతి దేవస్థానం అర్చకుడు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం, భక్తుల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘటాలతో తెచ్చిన నదీ జలం నేరుగా శివలింగంపై కాకుండా పైపులో పోసిన నీరు శివలింగంపై పడేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం శివలింగాన్ని పూర్తిగా మూసివేస్తూ ఇటుకలతో చతురస్రం గది నిర్మించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు జలాభిషేకం కొనసాగింది. అనంత రం స్వామికి నవహారతులు సమర్పించారు. సాయంత్రం అభిషేకం పూర్తయ్యే సమయానికి రోజూ మాదిరిగానే వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన మార్కాపురం వెంకటరమణ, వెంకటేశ్వరరావు(55)లు భార్యాభర్తలు. వెంకటేశ్వరరావు బార్బర్ షాపు నడుపుతుంటాడు. ఈ నెల 3న షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న వెంకటేశ్వరరావును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేశ్వరరావును అజిత్సింగ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఘటనపై వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


