● రూ.30 లక్షల ఆస్తినష్టం ● ఆదివారం కావడంతో తప్పిన ప్రాణనష్టం
ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ బస్డిపో పక్కన ఉన్న హ్యూండాయ్ కార్ల షోరూమ్పై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో షోరూమ్ మొదటి అంతస్తుపై పిడుగు పడటంతో రెండు క్యాబిన్లు దగ్ధం అయ్యాయి. ఇందులో అడ్మినిష్ట్రేషన్ గది, కంప్యూటర్లు కాలిపోయాయి. ఏసీలు, ఫర్నిచర్ సర్వర్ గదితో పాటు కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో షోరూమ్పై పిడుగు పడటంతో మంటలు వచ్చాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కన ఉన్న కార్లకు నిప్పు అంటుకోకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం కావడంతో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
తప్పిన పెనుప్రమాదం..
ఆదివారం కావడం వల్ల షోరూమ్లో పనిచేసేవారు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సోమవారం నుంచి శనివారం వరకు వారంలో సుమారు 100 నుంచి 120 మందికి పైగా ఇక్కడ పనిచేస్తారని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. స్పేర్పార్ట్లు, కార్లు సర్వీస్ చేస్తుంటారు. ఆదివారం కావడం వల్ల కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, పిడుగు పడిన సమయంలో వారంతా వేరే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కార్లు ఉన్న ప్రాంతంలో పిడుగు పడి ఉంటే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని సమాచారం.


