అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందమూరినగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే ఇంటి తాళాలు పగలకొట్టి ఆ ఇల్లును కొల్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరినగర్ ఏడో లైన్లో మొండి రేవతి, వెంకట రమణ దంపతులు నివసిస్తున్నారు. భర్త మహేంద్ర కంపెనీలో పనిచేస్తుండగా రేవతి ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 5వ తేదీన వెంకటరమణ తన పనులకు వెళ్లిపోగా ఉదయం 10 గంటలు దాటిన తరువాత రేవతి తన ఇంటికి తాళాలు వేసి వారి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలకొట్టి కనిపించాయి. బెడ్రూమ్లోని అలమరలో దాచుకున్న 97 గ్రాముల బంగారపు వస్తువులతో పాటు రూ.74 వేల నగదు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకూ అజిత్సింగ్నగర్ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన ఐదు గంటల వ్యవధిలోనే ఇంట్లో దొంగతనం జరగడంతో పోలీసులు ఇది పాత నేరస్తుల పనా.. లేక బాధితులకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఛోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల వివరాలను రాబడుతున్నారు.
97 గ్రాముల బంగారం,
రూ.74 వేలు నగదు చోరీ


