మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమా వేశం జరిగింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, విద్యుత్ సబ్స్టేషన్లలో ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ మొదలైనఅంశాలపై చర్చించారు. అనంతరం పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తరచూ ట్రిప్పింగ్కు గురయ్యే ఫీడర్లు, ఓవర్ లోడ్ అవు తున్న ట్రాన్స్ఫార్మర్లు, బలహీనంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. పీక్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎల్నినో ప్రభావం నేప థ్యంలో డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితులు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు ,సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


