రేపు రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

రేపు రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు పది విశేష అలంకారాలు కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో ప్రారంభం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నగరంలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల ఐదో తేదీన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని జిల్లాల నుంచి ఎంపిౖకైన 183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అవార్డులు అందుకోనున్న వారి జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, వరుస క్రమంలో ఉపాధ్యాయులు కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, రాజమండ్రి ఆర్జేడీ నాగమణి, డీఆర్వో వెన్నెల శ్రీను, డీఈఓ ఎల్‌.చంద్రకళ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బోధనలో ప్రతిభకు

రాష్ట్రస్థాయి గుర్తింపు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఎ.కొండూరు మండలం కోడూరు మోడల్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మందడపు రాంప్రదీప్‌, విజయవాడ రాజీవ్‌నగర్‌ ఉపాధ్యాయిని కె.గంగ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల ఐదో తేదీన విజయవాడలో జరిగే గురుపూజోత్సవాల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు. గత ఏడాది కోడూరు పాఠశా లకు బదిలీపై వచ్చిన రాంప్రదీప్‌ ఇంటింటి ప్రచా రంతో విద్యార్థుల సంఖ్యను 63 నుంచి 86కు పెంచారు. గతంలో పనిచేసిన గానుగపాడు ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా వర్గో న్నతి కల్పించడంలో, పాఠశాలకు దాతల ద్వారా రూ.50 లక్షల విలువ చేసే స్థలం, రూ.5 లక్షల విరాళాల సేకరణకు కృషిచేశారు. కొర్రా గంగ విజ యవాడ రాజీవ్‌నగర్‌లో రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. గతంలో కండ్రికలో పాఠశాలలో హిందీలో నూరు శాతం ఫలితాలు సాధించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ పది విశేష అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. గురువారం జరిగిన ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో దసరా విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్‌ను దుర్గగుడి ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఈ మేరకు 11వ తేదీ నుంచి అమ్మవారు పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల తొలి రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇక విజయ దశమి మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంసవాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసి ఉపాధి, స్వయం ఉపాఽధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్‌ సూచించారు. ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లో కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో, అకాడమీ, ల్యాబ్‌లను ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశతో కలిసి మంత్రి కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్‌ క్రియేషన్‌ స్టూడియో, అకాడమీ యువతకు ఉపాధి కల్పించే వేదికగా నిలుస్తాయన్నారు. జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్‌ రూపంలో డాక్యుమెంట్‌ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీపీఆర్‌ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement