జీజీహెచ్లో ప్రభుత్వ వైద్యుల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగుల నాడిచూసి వైద్యం చేయాల్సిన డాక్టర్లు ప్లకార్డులు చేబూని ఆందోళన బాటపట్టారు. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఆంధ్రప్రదేశ్ (జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా నిరసన బాటపట్టారు. తొలుత పది రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మూడు రోజులుగా రోజూ అర్ధగంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. జీడీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ.. తమకు రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాస్తే ఇవ్వలేమని సమాధానం ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వైద్యులపై ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఎన్నో సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫె సర్లు లేక ప్రొఫెసర్లే నైట్ డ్యూటీకి రావాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన ఏపీ డీ–ఫార్మసీ (ఎంపీసీ, బైపీసీ)లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి గురువారం తెలిపారు. దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఆరో తేదీ రాత్రిలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈ నెల ఏడో తేదీ రాత్రి వరకు అవకాశం ఉందని తెలిపారు.


