కృష్ణలంక(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన 2026 మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే జీవో 102ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఎన్యూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 71,547 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించిన 43మంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించారన్నారు. ఎస్వీయూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94,966 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు వచ్చిన 27 మంది రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ సీట్లు ఇవ్వకుండా రిజర్వేషన్ సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ కంటే మంచి మార్కులు లేదా ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని డిమాండ్ చేశారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్క్రబ్బర్ వ్యాపారం పేరుతో వందల మంది నుంచి రూ. కోట్లు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ‘మాషా అల్లా ఎంటర్ప్రైజెస్’ కేసులో ప్రధాన నిందితులైన సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం, అతని భార్య సుమలను విచారణ నిమిత్తం ఎస్ఎన్పురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజుల పాటు నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్దు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు గురువారం విజయవాడ సబ్ జైలు నుంచి నిందితులను ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో కోట్ల రూపాయలు మోసపోయినట్లు వెయ్యి మందికి పైగా బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ డబ్బుకు సంబంధించి లావాదేవీల గురించి విడివిడిగా నిందితులను విచారించగా వీటిపై కొన్నింటికీ సమాధానాలు చెప్పినా కొన్ని ప్రశ్నలకు మౌనంగా దాట వేస్తున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 8వ తేదీ వరకు పూర్తిస్తాయిలో పోలీసులు విచారించనున్నారు.


