మచిలీపట్నంఅర్బన్: గ్రామాల పారిశుద్ధ్యం, తడి–పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, కార్మికులను స్వర్ణ పంచాయతీ పోర్టల్లో నమోదు చేసి నేరుగా విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఒక్కరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు జారీ చేసిన జీవోలను అమలు చేయాలని, కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఒకే పని చేస్తున్న కార్మికులకు రూ.1,500 నుంచి రూ.14,500 వరకు వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారని, ఈ వ్యత్యాసాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని జీఓ నంబర్ 680లో ఉన్నప్పటికీ అనేక పంచాయతీల్లో అమలు కావడం లేదన్నారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. జగన్, ఎం. గణేష్, కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు, నాగమణి, సభ్యులు పాల్గొన్నారు.


