● రెండున్నరేళ్లలో ఏ ఒక్కరికై నా స్థలాలు ఇచ్చారా? ● సెప్టెంబర్ 15వ తేదీ లోపు స్పందించకపోతే ఖాళీ ఇళ్ల స్వాధీనం, గృహప్రవేశాలు చేస్తాం ● ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇళ్ల పట్టాల విషయంలో మాట తప్పిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్, టిడ్కో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల తక్షణ పంపిణీ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యాన పేదలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేశారు. మ్యూజియం రోడ్డులో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన పేదలు, సీపీఎం నేతలు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లి బైఠాయించారు. కార్యాలయం గేట్లు ఎక్కి నిరసన తెలియజేశారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్లోకి వెళ్లి జేసీ ఎస్.ఇలక్కియకు సామూహిక అర్జీలు అందించారు. సమస్యలు తెలియజేశారు. డీఆర్వో లక్ష్మీ నరసింహం ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్లు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు, పెద్ద కంపెనీలకు లక్షల ఎకరాల భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం.. పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలు వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఐదేళ్లు, పదేళ్లుగా మొండి గోడలతో, ఖాళీ స్థలాలుగా పెండింగ్లో ఉండటం అన్యాయమన్నారు.
ప్రభుత్వం దొంగాట
టిడ్కో ఇళ్ల కోసం యాభై వేల నుంచి రూ. రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేసి పదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పేదల ఇళ్లను అమ్ముకుంటున్నారన్నారు. 2025 నుంచి ప్రజలు పీజీఆర్ఎస్ ద్వారా వందలాది దరఖాస్తులు ఇస్తున్నా కనీసం రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం దొంగాట ఆడుతోందని మండిపడ్డారు. కలెక్టర్ ఇచ్చే హామీని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని, ౖపైపె మాటలు చెబితే కలెక్టరేట్ కార్యాలయాన్ని వంటా వార్పుతో పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయాలని డెడ్లైన్ విధించారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించకపోతే లబ్ధిదారులతో తామే నేరుగా గృహప్రవేశాలు చేస్తామని, ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణరావు, పి.కృష్ణ, కె.దుర్గారావు, ఈవీ నారాయణ, ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


