కంకిపాడు: డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ ఆదేశించారు. కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని అంకమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి ఇంటింటి సర్వే తీరు, పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. సీహెచ్సీలో రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. డయేరియా పరిస్థితి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రెహమాన్తో సమీక్షించారు. మందుల లభ్యత, రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలన్నారు. ఇంటింటి సర్వే సమర్థంగా నిర్వహించాలన్నారు. వాంతులు, విరేచనాలు లక్షణాలతో పాటుగా జ్వరాలు గుర్తిస్తే ఆసుపత్రులకు తరలించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల చేరిక గురించి వివరాలు తెలుసుకోవాలన్నారు. డ్రెయిన్లు, కాలువల్లో మురుగు, వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలన్నారు. కంకిపాడుతో పాటుగా అన్ని గ్రామాల్లోనూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ సుమలత, తహసీల్దార్ వి.భావనారాయణ, ఎంపీడీఓ బసవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
డయేరియా అదుపులోనే ఉంది : కలెక్టర్
కంకిపాడులో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకోలుకోని కంకిపాడుశ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వాంతులు, విరేచనాల లక్షణాలతో ప్రజలు ఇప్పటివరకూ 15 మంది కంకిపాడు సీహెచ్సీలో చేరారని, తొమ్మిది మంది వైద్యం పొంది డిశ్చార్జి కాగా, ఆరుగురు వైద్యం పొందుతున్నారన్నారు. నీటి శ్యాంపిళ్లు సేకరించి గుడివాడ ల్యాబ్కు తరలించామని, ఇంటింటి సర్వే ద్వారా బాధితులను గుర్తించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామన్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని భుజించొద్దని సూచించారు.


