ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శనివారంతో పరిసమాప్తమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో శనివారం ఉదయం ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోటప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధా కృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వేద పండితులు యాగశాలలో గత మూడు రోజులుగా పూజించిన పవిత్ర జలాలను దేవతా మూర్తులు, ఆలయ ప్రాంగణానికి సంప్రోక్షణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, శ్రీధర్ శర్మ, దేవస్థాన కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేటి నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు
దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం ముగియడంతో ఆదివారం నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. ఆయా సేవలకు అవసరమైన టికెట్లను ఆన్లైన్తో పాటు వాట్సాప్, దేవస్థాన ప్రాంగణంలోని సేవా టికెట్ల విక్రయ కేంద్రాలలో పొందవచ్చునని పేర్కొన్నారు.


