ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు స్నపనాభిషేకం, అమ్మవారికి అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అఖండ దీపారాధనలతో ఉత్సవాలు ప్రారంభమ్యాయి. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, దుర్గాప్రసాద్, వేద పండితులు షణ్ముఖ శాస్త్రి పర్యవేక్షణలో అర్చకులు ఉత్సవాలను జరిపించారు. ఈవో శీనానాయక్, ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల విరాట్తో పాటు మల్లేశ్వరస్వామివారికి, ఆలయ ప్రాంగణంలో ఇతర పరివార దేవతలు, ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పవిత్రాలను అలంకరించారు. ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో తెలిసీ తెలియక ఆలయంలో ఎటువంటి తప్పులు, అపచారాలతో కలిగే దోష నివారణకు పవిత్రోత్సవాలను జరిపిస్తామని అర్చకులు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ అర్చకుల పర్యవేక్షణలో హోమాలు, యాగాలను నిర్వహించారు. ఇవి శనివారం వరకు జరుగుతాయి


