ప్రాజెక్ట్ నోడల్ అధికారి ఉదయలక్ష్మి భూ, భవన యజమానులు, వ్యాపారులతో సమావేశం
పెనమలూరు: రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మెట్రో రైల్ ప్రాజెక్ట్ నోడల్ అధికారి ఉదయలక్ష్మి చెప్పారు. దీనికి భూ, భవన యజమానులు, వ్యాపారులు సహకరించాలని కోరారు. పెనమలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పెనమలూరు, గన్నవరం ప్రాంతాలకు చెందిన భూ, భవన యజమానులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నుంచి పెనమలూరు, గన్నవరం ప్రాంతాలకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. మొత్తం రూ 10,188 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. మెట్రోలైన్ 38.40 కిలోమీటర్లు ఉంటుందని, అలాగే మొత్తం 31 స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారన్నారు. ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తారని, కేంద్రప్రభుత్వం ఆమోదించాల్సి ఉందన్నారు.
మెట్రో స్టేషన్లు ఇవే...
పెనమలూరు, గన్నవరం మండలాల్లో మెట్రో రైల్ స్టేషన్ల ప్రతిపాదనలు వెల్లడించారు. పెనమలూరు మండలంలో కానూరు సిరీస్ సమీపంలో, సెంటినీ సినీమాల్ ప్రాతంలో, సిద్ధార్థ కాలేజీ ఎదురుగా ఇరిగేషన్ కాలువ కట్ట (వసంత నగర్), పోరంకి కర్లపూడి కల్యాణ మండపం సమీపంలో, శివాలయం వద్ద, పెనమలూరు సెంటర్ దాటిన తరువాత స్టేషన్లు వస్తాయన్నారు. గన్నవరం పరిధిలో కేసరపల్లి గ్రామం, ఎయిర్పోర్టు సమీపంలో హెచ్సీల్ వద్ద, బస్టాండ్, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు వద్ద స్టేషన్లు వస్తాయన్నారు. భూ, భవన యజమానులు వారి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
మాకు న్యాయం చేయాలి...
మెట్రో ప్రాజెక్ట్కు తాము సహకరిస్తామని, కానీ తమకు ఆశించిన స్థాయిలో పరిహారం ఇవ్వాలని భూ, భవన యజమానులు కోరారు. ప్రతిపాద మెట్రోస్టేషన్ల వద్ద భవనాలు, దుకాణాలు ఉన్నాయని అన్నారు. ప్రాజెక్ట్కు స్థలం ఇవ్వటం వలన విలువైన భూమితో పాటు, వ్యాపారాలు కోల్పోతామని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వం భూ,భవన యజమానులు, వ్యాపారులకు పూర్తిగా న్యాయం చేయాలన్నారు. పరిహారం ఎంత ఇచ్చేది వివరాలు అధికారికంగా ప్రకటిస్తే తమ నిర్ణయం తెలుపుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ రంగారావు, పెనమలూరు, గన్నవరం తహసీల్దార్లో రాజు, శివయ్య, టెక్నికల్ ఇంజినీర్లు శివప్రసాద్, శ్యామ్సుందర్, భూ,భవన యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు.


