● కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీకి వివరించిన డయేరియా బాధితులు ● ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో డయేరియాపై సమీక్ష
ఉయ్యూరు: కలుషిత తాగునీటి వల్లే డయేరియా బారిన పడి ఆస్పత్రి పాలయ్యామని డయేరియా బాధితులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి మొరపెట్టుకున్నారు. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సందర్శించారు. డయేరియా లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆహారం, తాగునీరు స్వీకరణ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న బాధితులు, వారి కుటుంబ సభ్యులు కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. పైపులైన్లలో వచ్చే నీటిని తాగుతున్నామని, మురుగునీరు పైపులైన్లలో కలవటంతో వాసన వస్తోందని, ఆ నీటిని తాగే వాంతులు, విరేచనాలు బారిన పడ్డామని వాపోయారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు.
మెరుగైన సేవలు..
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఇంటింటి సర్వే సమర్థంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉయ్యూరులో డయేరియా పరిస్థితిపై ఆస్పత్రిలోని ఓ గదిలో అధికారులకు క్లాస్ తీసుకున్నారు.
అదుపులో డయేరియా..
డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కొత్త కేసులు పెద్దగా నమోదు కాలేదన్నారు. మంగళవారం డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించి ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందన్నారు. డీఎంహెచ్ఓ లోక్నాథ్ దయాకర్, డీసీహెచ్ఎస్ శేషుకుమార్, ఆర్డీఓ కరుణకుమారి, మునిసిపల్ కమిషనర్సుభాష్ చంద్రబోస్, తహసీల్దార్ సురేష్కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


