మూలపాడు(ఇబ్రహీంపట్నం): క్రీడలు ఉద్యోగుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మూడు రోజులుగా జరిగిన ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. మండలంలోని మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, రెవెన్యూ, సెక్రటేరియట్, పంచాయతీరాజ్, ఏపీ ఎన్జీవో, మున్సిపల్, సెక్రటేరియట్ తదితర మొత్తం పది జట్లు పాల్గొనగా, మొత్తం పది మ్యాచ్లు జరిగాయి. ఫైనల్ మ్యాచ్లో ఏపీ ఎన్జీవో, స్కూల్ ఎడ్యుకేషన్ జట్లు తలపడ్డాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ టీం నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ జట్టు మెరుగైన ఆటతీరుతో ఘన విజయం సాధించి టైటిల్ కై వసం చేసుకుంది. విజేతలకు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ యూటీజేఏ అసోసియేషన్ నిర్వాహకులు పి .రమేష్ బాబు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


