లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మహిళలు అందిస్తున్న సేవలు అమూల్యమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను వీసీ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధి స్తున్నారన్నారు. అకడమిక్, పరిశోధన, నాయకత్వం వంటి అంశాల్లోనూ సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ మాట్లాడుతూ.. లింగ సమానత్వం అనేది ఒక లక్ష్యం కాదని, అది ఉమ్మడి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన వర్సిటీ మహిళా ఉద్యోగులు ఎన్.బి.లక్ష్మి, వి.ఝాన్సీతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఎంఆర్యూ పరిశోధనల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవిప్రభు, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎస్.కిరిటీ, పీఆర్ఓ వీరకిరణ్ను సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, సీఓఈ డాక్టర్ చక్కా శ్రీకాంత్, ఫైనాన్స్ ఆఫీసర్ టి.కృష్ణ, కె.ఎల్.ఆర్.కె.ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్


