ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయ వాడకు చెందిన భక్తుడు మంగళవారం సుమారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కానుకగా సమర్పించారు. నగరంలోని చెరువు సెంటర్కు చెందిన దొడ్ల నారాయణరావు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ.16.87 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ను అమ్మ వారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.
పెనుగంచిప్రోలు: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ తలుపులను కవాట బంధనం చేసి మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం 5.30 గంటలకు గోపూజ, ఆలయ పరిసరాలు ఽశుద్ధి చేసి సంప్రోక్షణ అనంతర భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గోపీబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ టౌన్: చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నామని కనీస వేతనాలు అందించాలని అడిగినందుకు అక్రమ అరెస్ట్లు చేయటమేంటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కటారపు గోపాల్ పేర్కొన్నారు. విజయవాడలో శాంతియుత నిరసన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. తొలుత గాంధీ సెంటర్ నుంచి రైతుపేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోవడంతో పాటు కనీస వేతనాలు అందించాలని అడిగిన అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని.. మొండిగా వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపీనాయక్, సయ్యద్ ఖాసిం, అంగనవాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సరళ, వెంకట్రావమ్మ, సుజాత, వేణు, పుల్లమ్మ, మహాలక్ష్మీ, పిచ్చమ్మ, అపర్ణ, లక్ష్మీ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.


