ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. నగరంలో ఏలూరు రోడ్డులోని ఆదిత్య డెంటర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ బి.రాజీవ్, ప్రశాంతి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈవారంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్ల్లోనే అందుబాటులో ఉంటాయని, ఇతర అనధికారిక వెబ్సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. హాల్ టికెట్లను www. bre.ap.gov.in వెబ్సైట్, వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర 95523 00009 లేదా లీప్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి, హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


