‘బాబూ’.. తప్పుదోవ పట్టించొద్దు!
● రైతులను ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు
●న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే సమ్మె
●సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు
చల్లపల్లి: కో–ఆపరేటివ్ ఇన్చార్జి కమిషనర్ బాబు సహకార సొసైటీలపై లేనిపోనివి చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్ర రవికుమార్, కృష్ణాజిల్లా జిల్లా అధ్యక్షుడు తోట కృష్ణారావు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. కాగా అవనిగడ్డ నియోజవర్గంలోని 37 సొసైటీలకు చెందిన 130 మంది ఉద్యోగులు, సిబ్బంది స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాలు 40 శాతం నష్టాల్లో ఉన్నాయన్నది వాస్తవమైతే ఆ నష్టాలకు కారకులెవరో కమిషనర్ బాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. అందరం చిన్న ఉద్యోగులమని కింది స్థాయిలో రైతాంగానికి విత్తనం దగ్గర నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకూ ఏన్నో సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవం బాధాకరమన్నారు.
న్యాయ పోరాటానికి సిద్ధం..
ఇతర రాష్ట్రాల్లో ఏజెన్సీల ద్వారా సొసైటీల కంప్యూటరీకరణ చేయిస్తే.. మన రాష్ట్రంలో మాత్రం కమిషనర్ తమతోనే అన్ని కంప్యూటీకరణ పనులు చేయించారని కృష్ణారావు చెప్పారు. కంప్యూటర్ సిబ్బందిని రెగ్యులర్ చేయకపోతే న్యాయపోరాటానికై నా తాము సిద్ధమని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని రైతులను ఇబ్బంది పెట్టాలని గానీ, సొసైటీలను నష్టపెట్టాలని గానీ తమ ఉద్దేశం కాదని విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు ఆమరణ నిరాహార దీక్షకు కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు కోసూరు రామాంజనేయులు, సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


