డ్రెయిన్లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): డ్రెయిన్లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కేటీ రోడ్డులోని బెజ్జాల మేడ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రెయిన్లో ఓ వ్యక్తి పడి ఉండటాన్ని బార్ వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న నరసింహారావు గుర్తించారు. వెంటనే మరో వ్యక్తి సాయంతో బయటకు తీశారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనపై కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.