చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా

17th ATA Conference and Youth Convention Grand Success - Sakshi

వాషింగ్టన్‌ డీసీ:  అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి  కావటం విశేషం.

సద్గురు జగ్గీ వాసుదేవ్  పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది.  

125  మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న  “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో  కూచిపూడి,  గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల  కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో  సోదాహరణంగా  “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు.  ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు.

ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు.  ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు.  రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు.

ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది.

జులై 3న  ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు  హీరోయిన​ రకుల్ ప్రీత్ సింగ్,  నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు.

బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్  ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్  రెడ్డి,  మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి,  భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు  కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు .

ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని  అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల  తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. 

మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో  ప్రేక్షకులను ఉర్రూతలూగారు.

=అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్  కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా  ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. 

వెండర్‌ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్‌ని పించాయి.   ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి  సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి  విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top