ఆర్మూర్ : ప్రారంభ దశలోనే విద్యార్థుల్లో దివ్యాంగ లక్షణాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ప్రశస్త్’ యాప్ అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో లొసుగులు అడ్డుగా మారుతున్నాయి. జిల్లాలోని 1,844 ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 15,642 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని 640 ప్రైవేట్ పాఠశాలల్లో 10,095 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వైకల్య నిర్ధారణ చేయడంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు పంపించారు. అయితే శుక్రవారం నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 12,801 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 11,414 మంది వీడియోలు చూశారు. 72.97 శాతం లక్ష్యం మాత్రమే పూర్తయింది. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యం ఉన్నా, ప్రైవేట్ పాఠశాలల తీరుతో పరిస్థితి మెరుగుపడడం లేదు.
క్షేత్రస్థాయిలో వెళ్తే..
ప్రశస్త్ వీడియోలపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ టీచర్లు, ఐఈఆర్పీలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే తలలు పట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో పనిచేసే క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల వివరాలు యూడైస్ ప్లస్లో నమోదు చేయాలి. విద్యాశాఖ వద్ద ఉండేది ఈ వివరాలు మాత్రమే. క్షేత్ర స్థాయికి వెళ్తున్న స్పెష ల్ టీచర్లు, ఐఈఆర్పీలకు విద్యా శాఖ నుంచి ఈ ఉపాధ్యాయుల సంఖ్య, సమాచారాన్ని మాత్రమే విద్యా శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. అయితే ఆ వివరాలను తీసుకొని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిన వారు అయోమయానికి గురవుతున్నారు. యూడైస్ ప్లస్లో నమోదైన ఉపాధ్యా యులు చాలా వరకు క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదు. నిబంధన ప్రకారం యూడైస్ ప్లస్లో నమోదైన ఉపాధ్యాయులు మాత్రమే తమ ఐడీలతోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రశస్త్ వీడియోలు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లు వీడియోలు చూసినా, యాప్లో అప్డేట్ కాకపోవడంతో జిల్లాలో అవగాహన శాతం పెరగడం లేదు. ఇదే పరిస్థితి చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఉందని స్పెషల్ టీచర్లు చెబుతున్నారు. వీడియోల ద్వారా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో మొదటి పిల్లల ప్రవ ర్తన, శారీరక లక్షణాలను గమనించి యాప్లో నమోదు చేయాల్సి ఉండగా, ప్రైవేట్లో ఈ లొసుగులు ఇబ్బందిగా మారాయి. ఇదే విషయమై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించగా తమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు ఎప్పటికప్పుడు యూడైస్ ప్లస్లో నమోదు చేస్తున్నప్పటికీ అది అప్డేట్ కావడం లేదని పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించకుండా వంద శాతం లక్ష్యం నెరవేర్చడం కింది స్థాయి సిబ్బందికి కష్టంగా మారుతోంది.
ఒక ప్రైవేట్ పాఠశాలను
పరిశీలిస్తే..
యూడైస్ ప్లస్ ఆధారంగా జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు 10 మంది ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పాఠశాలలో సుమారు 40 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో చాలా మందికి విద్యా బోధనకు సరిపడా క్వాలిఫికేషన్ కూడా లేదని తెలుస్తోంది. యూడైస్ ప్లస్లో నమోదైన 10 మంది ఉపాధ్యాయుల్లో చాలా వరకు ప్రస్తుతం ఆ పాఠశాలలో లేకపోవడం సమస్యగా మారింది.
స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం
ప్రైవేట్ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ లో నమోదైన ఉపాధ్యాయులు లేక పోవడం మా దృష్టికి వచ్చింది. ప్రశ స్త్ రిజిస్ట్రేషన్ యూడైస్ ప్లస్లో న మోదైన డేటా ఆధారంగానే జరుగుతుంది కాబట్టి ఆ ఉపాధ్యాయులు తప్పనిసరిగా వీడియోలు చూడాలి. ఈ సమస్యను డీఈవో దృష్టికి తీసుకెళ్లి, ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం. – వడకంటి శ్రీనివాసరావు,
సెక్టోరల్ ఆఫీసర్, సమగ్ర శిక్ష, నిజామాబాద్
యూడైస్ ప్లస్..
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆన్లైన్ డేటా బేస్ పోర్టల్ను యూడైస్ ప్లస్ అంటారు. ఇందులో పాఠశాల ప్రొఫైల్, వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు గుర్తింపు పొందిన పాఠశాలలకు 11 అంకెల యూడైస్ కోడ్ను కేటాయిస్తారు.
యూడైస్ ప్లస్లో ఉపాధ్యాయుల
సమాచారానికి..
క్షేత్ర స్థాయిలో సమాచారంలో తేడాలు
క్వాలిఫైడ్ టీచర్లు 10 మంది..
పని చేస్తున్నది 40 మంది
బయటపడుతున్న లొసుగులు


