● అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో
ఘనంగా వేడుకలు
● నృత్యాలు చేసిన యువకులు, చిన్నారులు
సుభాష్నగర్/ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ జక్రాన్పల్లి: ఇందూరులో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ చిన్నా, పెద్దా సందడి చేశారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. దీంతో వీధులన్నీ రంగులమయంగా మారాయి. సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. యువత, చిన్నారులు, మహిళలు రంగులు పూసుకుని.. నృత్యాలతో హోరెత్తించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర స్వయంసేవకులు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకొన్నారు. నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రార్థన చేసిన అనంతరం నగరంలోని జేష్ఠ కార్యకర్తల ఇంటికి వెళ్లి సహజ రంగులతో వారికి వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని ఈ ఏడాది కూడా కొనసాగించినట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని బంజారా భవన్ వద్ద బంజారా నాయకులు హోలీ వేడుకలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి స్వగ్రామమైన ముల్లంగి(ఐ)లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, కొండూర్ తదితర గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. రంగుల దుకాణలు ప్రజలతో కిటకిటలాడాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కాకతీయ కళాశాలలో
నృత్యం చేస్తున్న విద్యార్థిని


