జీపీలకు సీఎం నిధులు వచ్చేనా..?
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ రెండు నెలలైనా అమలుకు నోచుకోలేదని సర్పంచులు పెదవి విరుస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున సీఎం కోటా నుంచి విడుదల చేస్తామని గత డిసెంబర్లో ప్రకటించారు. ఇప్పటి వరకూ నిధుల ఊసే లేకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధులు విడుదల చేసినా అవి అరకొరగానే ఉండటం, పంచాయతీల నిర్వహణకు నిధులను వినియోగించే వీలు లేకపోవడంతో సీఎం ఇచ్చే నిధుల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా చిన్న, పెద్ద పంచాయతీలకు రూ.32 కోట్ల వరకు విడుదలవుతాయని సర్పంచ్లు భావించారు. చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోవడం, పన్నుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో సీఎం కోటా నిధులతోనైనా ఊరట లభిస్తుందని ఆశించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం హామీని ఆచరణలో పెట్టాలని కోరుతున్నారు.
చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు,
పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు విడుదల చేస్తామన్న రేవంత్రెడ్డి
రెండు నెలలైనా సీఎం హామీ అమలుకు నోచుకోలేదంటున్న సర్పంచులు
జీపీలకు సీఎం నిధులు వచ్చేనా..?


