సమష్టి కృషితో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● అధికారులకు సన్మానం
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల ఎన్నికలు సా ఫీగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లను, ఎన్నికల విధులలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏవో ప్రశాంత్ పాల్గొనగా, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, ఉమా మహేశ్వర్ రావు, గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, రిటర్నింగ్ అధికారులు నర్సయ్య, నరేశ్, జే బస్వంత్, హఫీజుద్దీన్లను కలెక్టర్ సన్మానించారు. కాగా, అధికారులు అంతా కలిసి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మార్గనిర్దేశం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఘనంగా సన్మానించారు.


