చదువులు సాగేదెలా? | - | Sakshi
Sakshi News home page

చదువులు సాగేదెలా?

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

● నెలరోజులు పూర్తయినా అందని తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు ● ఇబ్బంది పడుతున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు

ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల సిలబస్‌ మారింది. ప్రథమ సంవత్సరం ఆంగ్ల భాషా పుస్తకాలు రావడంతో అన్ని కళాశాలలకు సరఫరా చేశాం. కొన్ని కళాశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులకు పుస్తకాలు రాలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పుస్తకాలు రాగానే పంపిణీ చేస్తాం. – పరశురాం, డీఐఈవో

తానూరు: నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు పూర్తయినా ప్రభుత్వ జూనియర్‌ కళా శాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠాలు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను నోట్స్‌ ఆధారంగా మాత్రమే అభ్యసించాల్సి వస్తోందని వాపోతున్నారు.

అందని ‘తెలుగు’ పుస్తకాలు..

ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల సిలబస్‌ మారింది. ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు ఆంగ్లభాషలో పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. కానీ తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు నేటికీ కళాశాలలకు చేరుకోలేదు. కొన్ని కాలేజీల్లో తెలుగు మీడియం వారికి ఆంగ్ల భాషా పుస్తకాలు పంపిణీ చేయడంతో అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలు అర్థంకావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆంగ్లమాధ్యమం విద్యార్థులకు తరగతులు సజావుగా సాగుతున్నా తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు అందించాల్సి ఉండగా, ఈసారి నెల రోజులు గడిచినా సరఫరా కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని కళాశాలలకు పూర్తిస్థాయిలో తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి

తీసుకెళ్లాం

జిల్లా వివరాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు : 13

ప్రథమ సంవత్సరం విద్యార్థుల సంఖ్య : 2,558

ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య : 2,338

మొత్తం విద్యార్థుల సంఖ్య : 4,896

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement