ఖానాపూర్: యూరియా పంపిణీలో ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు అన్నదాతలకు శాపంగా మారాయన్నారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో సుమారు 60 శాతం మంది రైతులకు మాత్రమే స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, మిగిలిన 40 శాతం మందికి యాప్ ఆధారిత విధానం వల్ల యూరియా పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాస్బుక్ ఆధారంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాదిరె శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి, మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్ గుమ్ముల ఆనంద్, నాయకులు గిరి, శ్రావణ్, రవీందర్, భూమన్న, తిరుమలేశ్, తదితరులు పాల్గొన్నారు.


