లక్ష్మణచాంద: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని పొట్టపల్లి(కె) గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ చీపురు పట్టి స్థానికులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ప్రత్యేక కార్యక్రమాల్లో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని తెలిపారు. అర్హత ఉన్న మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరాలన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణ ను ఇప్పించి మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. బాల్య వివాహాలు చేయొద్దని సూచించారు. తర్వాత, నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. రిజిస్టర్ పరిశీలించారు. మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.విద్యార్థులతో మాట్లాడి రోజూ పాఠశాలకు రావాలని సూచించారు. బోర్డుపై రాసిన అక్షరాలను వారితో చదివిపించారు. పాఠశాల మరమ్మతు గురించి ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, సర్పంచ్ ముఖేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


