Work From Home చాలు.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి బాబోయ్‌

Woman Plea to Allow Husband to Work From office Harsh Goenka Tweet Goes Viral - Sakshi

వైరలవుతోన్న హర్ష గోయాంక ట్వీట్‌

వర్క్‌ ఫ్రం హోం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణించిన లేఖ

ముంబై: కరోనా కారణంగా సాఫ్ట్‌వేర్‌ సహా చాలా రంగాల్లో వర్క్‌ ఫ్రం హోం కల్పించారు. ఇక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో అయితే దాదాపు రెండేళ్ల నుంచి వర్క్‌ ఫ్రం హోం కొనసాగతోంది. ఈక్రమంలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పూర్తిగా వర్క్‌ ఫ్రం హోం అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే వర్క్‌ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఆడవారికి చాకిరి మరింత పెరిగిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌ చూస్తే.. ఈ నివిదేకల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది.

ఈ ట్వీట్‌లో హర్ష్‌ గోయెంకా ఓ మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్‌ని ట్వీట్‌ చేశాడు. దీనిలో సదరు మహిళ నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు పిలవండి అని కోరుతూ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇంకొద్ది రోజులు వర్క్‌ ఫ్రం హోం ఇలానే కొనసాగితే.. మా వైవాహిక బంధం ముగుస్తుంది అని తెలపడం గమనార్హం.
(చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఇదీ పరిస్థితి!)


 
లేఖలో సదరు మహిళ ‘‘సార్‌ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్‌ అనే ఉద్యోగి భార్యను. ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు.. అన్ని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి’’ అని కోరింది.
(చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై!)

‘‘మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్‌ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదల్లో కూర్చుంటాడు. పైగా అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్‌ కాల్స్‌ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు’’ అని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
(చదవండి: ఇందిరా గాంధీ, జేఆర్‌డీ టాటా మధ్య ఆసక్తికర లేఖ..!)

అంతేకాక ‘‘ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నా భర్తను ఆఫీస్‌కు పిలిచి.. నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి’’ అని కోరింది.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వర్క్‌ ఫ్రం హోంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఈ లేఖలో చక్కగా వర్ణించారు. భర్తలకు వర్క్‌ ఫ్రం హోం వల్ల మాకు పని భారం పెరిగింది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే దీన్ని 5,300 మంది లైక్‌ చేయగా.. 480 మంది రీట్వీట్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top