ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్ధులు బాధ్యులా?
ఢిల్లీ : ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యార్థులు తమ భద్రత విషయంలో రాజీపడకూడదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు, వారే భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేది అని రాహుల్ పేర్కొన్నారు. 'నాకు అర్థం కాని విషయం ఏమిటంటే కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం ఉంటే దానికి మీరెందుకు బాధ్యత వహించాలి? తర్వాత ఎదురయ్యే పర్యవసనాలకు మీరెందుకు బాధ పడాలి? అసలు ఈ విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు బలవంతం చేయాలి? ప్రభుత్వమే విద్యార్థుల మాట వినడం చాలా ముఖ్యం' అని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ వీడియోలో పేర్కొన్నారు. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం విద్యార్థులతో ముచ్చటించి ఒక ఏకాభిప్రాయానికి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ రెండు పరీక్షలను వాయిదా వేయాలని శుక్రవారం విపక్షాలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీజేపేతర ప్రభుత్వాలు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్గడ్, పంజాబ్, మహారాష్ర్ట రాష్ర్టాలు ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. (జేఈఈ, నీట్పై సుప్రీంను ఆశ్రయించిన విపక్షాలు)
ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు)
NEET-JEE aspirants’ safety should not compromised due to the failures of the Govt.
Govt must listen to all stakeholders and arrive at a consensus.#SpeakUpForStudentSafety pic.twitter.com/Y1CwfMhtHf
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020