మమతపై మరో తిరుగుబాటు?  | Trinamool Congress is facing a major internal rebellion in West Bengal | Sakshi
Sakshi News home page

మమతపై మరో తిరుగుబాటు? 

Jun 6 2026 4:38 AM | Updated on Jun 6 2026 6:18 AM

Trinamool Congress is facing a major internal rebellion in West Bengal

పార్లమెంట్‌లోనూ చీలిక దిశగా తృణమూల్‌ కాంగ్రెస్‌ 

41 మంది ఎంపీల్లో 23 మంది పార్టీని వీడతారని చర్చలు 

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీకి, ఇప్పుడు పార్లమెంట్‌ సభ్యుల నుంచీ షాక్‌ తగలొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కనీసం 23 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారు ఏక్షణమైనా తిరుగుబావుటా ఎగురవేయవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  

ఎమ్మెల్యేల బాటలోనే ఎంపీలు.. 
ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి బయటపడింది. తిరుగుబాటు వర్గంలోని రితబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వర్గం తమ బలం మరింత పెరుగుతుందని ప్రకటించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఎంపీలు సైతం పార్టీకి, మమత మేనల్లురు అభిõÙక్‌ బెనర్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. 

పార్టీ సీనియర్‌ ఎంపీ కాకోలి ఘోష్‌ దస్తిదార్, పార్టీ విప్‌ కల్యాణ్‌ బెనర్జీల మధ్య ఉన్న విభేదాలు వెలుగులోకి వచ్చాయి. బెనర్జీ మహిళలపై విద్వేష పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఘోష్‌ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీపై అసంతృప్తితో ఉన్న ఘోష్, పార్టీలో ఉండగానే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఇక పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ సైతం వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. శాసనసభ పక్షం తర్వాత పార్టీ పార్లమెంటరీ పక్షం కూడా చీలిపోవచ్చని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ చీలిక ఉంటుందని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో టీఎంసీ వేరు కుంపటి ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం టీఎంసీకి లోక్‌సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది ఎంపీల్లో 23 మంది బయటకు వస్తే పార్లమెంట్‌లో పార్టీ బలం దాదాపు సగానికి పడిపోతుంది. కాంగ్రెస్‌ తర్వాత ప్రతిపక్ష కూటమిలో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా టీఎంసీకున్న ప్రాధాన్యం పడిపోయే అవకాశం ఉ ంది. ఇప్పటికే పలువురు పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అయితే బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సమిక్‌ భట్టాచార్య మాత్రం తిరుగుబాటు టీఎంసీ నేతలను పెద్దఎత్తున చేర్చుకునే ఆలోచన లేదని ఇటీవల ప్రకటించారు. దీంతో ఎంపీల పార్టీ మార్పు ఎక్కడికి దారితీస్తుందనేది మున్ముందు స్పష్టం కానుంది.  

కోల్‌కతా మేయర్‌ ఫిర్హాద్‌ హకీం రాజీనామా 
కోల్‌కతా: టీఎంసీ సీనియర్‌ నేత, కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఫిర్హాద్‌ హకీం తన పదవికి రాజీనామా చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందునే, పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ నుంచి అనుమతి తీసుకుని రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తలెత్తుకు వెళ్లిపోవాలన్నది తన కోరికంటూ వ్యాఖ్యానించారు. 

హకీమ్‌ తన రాజీనామా లేఖను కోల్‌కతా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాలా రాయ్‌ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే కూడా అయిన ఫిర్హాద్‌ హకీంకు..టీఎంసీ పట్టణ ప్రాంత నాయకత్వంలో మైనారిటీ వర్గం నేతల్లో అతిముఖ్యుడిగా పేరుంది. కోల్‌కతా 150 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మేయర్‌ ఫిర్హాద్‌. 2018 నుంచి ఆయన ఇదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కోల్‌కతాయే కాదు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ టీఎంసీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement