తెలుగు ఓటు ఎటువైపు? | Sachin Ahir's Defection Triggers New Political Buzz Among Worli Telugu Community, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

Jul 1 2026 3:06 PM | Updated on Jul 1 2026 3:30 PM

Telugu voters react on Sachin Ahir defection in Worli assembly constituency

సచిన్‌ అహిర్‌ పార్టీ మార్పుతో వర్లి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

సచిన్‌ అహిర్, శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే సునీల్‌శిందేకు స్థానిక తెలుగు ప్రజల్లో విశేష ఆదరణ

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే గెలుపు వెనుక ఈ ఇద్దరు నాయకుల కీలక పాత్ర

భవిష్యత్తులో తెలుగు ఓటర్లు ఎవరి ఎవరికి మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ  

సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామం వర్లీ నియోజకవర్గంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. శివసేన (యూబీటీ)కు చెందిన ఎమ్మెల్సీ, వర్లీ ప్రాంత సీనియర్‌ నాయకుడు సచిన్‌ అహిర్‌ ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరడంతో వర్లిలోని తెలుగు ఓటర్ల రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుందనే అంశం వర్లీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేకు అండగా నిలిచిన తెలుగు ఓటు బ్యాంకు ఇప్పుడు ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై ముఖ్యంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

వర్లి నియోజకవర్గంలో వర్లి నాకా, పద్మశాలీ చౌక్, బీడీడీ చాల్స్‌ 108 బిల్డింగ్‌తో పాటు పలు చుట్టు పక్కల ప్రాంతాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు స్థానిక రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగు ఓటు కీలకంగా మారడం వర్లి రాజకీయాల్లో సర్వసాధారణం. సచిన్‌ అహిర్‌ ఏ పార్టీలో ఉన్నా తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సంఘాల కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు తెలుగు ప్రజల్లో వ్యక్తిగతంగా మంచి ఆదరణ ఏర్పడింది. అందుకే రాజకీయ పార్టీ కంటే సచిన్‌ అహిర్‌ వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ఓటర్లు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. 

ఇదే సమయంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ సునీల్‌ శిందే కూడా వర్లి తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగు సంఘాలు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానికులతో నిరంతరం మమేకమవుతూ ఆయన కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు కూడా మంచి ఆదరణ ఉందని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే విజయంలో సచిన్‌ అహిర్, సునీల్‌ షిందే ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగు ఓటర్లను సమీకరించి ఆదిత్య ఠాక్రేకు అనుకూలంగా మద్దతు కూడగట్టడంలో ఈ ఇద్దరు నాయకుల పాత్ర ముఖ్యమైందని అప్పట్లో రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. సచిన్‌ అహిర్‌ శిందే శివసేనలో చేరగా, సునీల్‌ షిందే మాత్రం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లోనే కొనసాగుతున్నారు. దీంతో రాబోయే భవిష్యత్‌ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

దుకాణాలు, రోడ్లు చర్చావేదికలుగా..   
ప్రస్తుతం వర్లిలో తెలుగు ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నారు. కొందరు ఉద్ధవ్‌ ఠాక్రే శివసేనకు, మరికొందరు శిందే శివసేనకు, బీజేపీ, కాంగ్రెస్, ఎన్‌సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) తదితర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ, వ్యక్తిగతంగా సచిన్‌ అహిర్‌కు మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య అలాగే సునీల్‌ శిందే మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.

మంగళవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పటికీ వర్లి నాకా, పద్మశాలి చౌక్, 108 బిల్డింగ్‌ చుట్టూ ఉన్న పలు తెలుగు సంఘాల భవనాల్లో దుకాణాలలో రోడ్లపై   తెలుగు ప్రజలు ఈ రాజకీయ పరిణామంపై చర్చించుకుంటూ కనిపించారు. ‘ఇకపై తెలుగు ఓటు ఎటువైపు?‘, ‘సచిన్‌ అహిర్‌ ప్రభావం ఎంతవరకు ఉంటుంది?‘, ‘సునీల్‌ శిందే మద్దతుతో యూబీటీ తన పట్టు నిలబెట్టుకోగలదా?‘ వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి.

చ‌ద‌వండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర‌యాణికులు ఫైర్‌

రాబోయే రోజుల్లో సచిన్‌ అహిర్‌ శిందే శివసేన తరఫున ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా, సునీల్‌ శిందే ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన తరఫున ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్లి తెలుగు ఓటర్లపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు ఓటర్లు రెండు వర్గాలుగా చీలుతారా? లేక అభ్యర్థులు, స్థానిక పరిస్థితులు, ఎన్నికల నాటికి ఏర్పడే రాజకీయ సమీకరణాల ఆధారంగా ఒకే వైపు మొగ్గు చూపుతారా? అన్నది ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. దీనిపై స్పష్టత రావాలంటే రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, స్థానిక నాయకుల వైఖరి, ఎన్నికల ప్రచార సరళిని వేచి చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement