
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.
ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.
NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv
— UPSC Post 📫 (@upscpost) June 20, 2025