
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారు. ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి హోంమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం భారత్- పాకిస్తాన్ విభజన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఆ సమయంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హిందూ ముస్లిం అల్లర్లను నియంత్రించడంలో పటేల్ సహకారం మరువలేనిది. ఇంతటి మహాన్నత వ్యక్తి జీవిత చరమాంకంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజు(డిసెంబరు 15) సర్దార్ పటేల్ వర్థంతి.
చదువులో వెనుకబడినా..
వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నదియాడ్లో జన్మించారు. ఝవేర్భాయ్ పటేల్- లడ్బా దేవిల ఆరుగురు సంతానంలో వల్లభాయ్ పటేల్ నాల్గవవాడు. అతని చదువు నెమ్మదిగా సాగింది. సర్దార్ పటేల్ తన 22 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తదనంతరం ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్ అయ్యాడు.
ఎనలేని సన్మానాలు
స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్కు దేశ విదేశాల్లో ఎంతో గౌరవం లభించింది. 1948 నుండి 1949 మధ్యకాలంలో నాగ్పూర్, అలహాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. 1947 జనవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖచిత్రం టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది.
తప్పిన విమాన ప్రమాదం
1949, మార్చి 29న సర్దార్ పటేల్ తన కుమార్తె మణిబెన్,పటియాలా మహారాజుతో కలిసి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డి హావిలాండ్ డోవ్ విమానంలో ఢిల్లీ నుండి జైపూర్కు వెళ్తున్నారు. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానయాగ అధికాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాలని పైలట్కు సూచించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం ఎడారిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. నాడు సర్దార్ పటేల్ అక్కడికి సమీప గ్రామంలో బస చేశారు.
క్షీణించిన ఆరోగ్యం
విమాన ప్రమాదం నుంచి బయటపడిన పటేల్కు పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది. విమాన ప్రమాదంపై చర్చల కారణంగా సభా కార్యక్రమాలు అరగంట వరకు ప్రారంభం కాలేదు. కొంతకాలానికి పటేల్ ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో పటేల్ ఓ ప్రైవేట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ రాయ్ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన కూడా పటేల్కు చికిత్స అందించారు.
ఢిల్లీ నుండి ముంబైకి వచ్చి..
1950 నవంబర్ న పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయన తరచూ స్పృహ కోల్పోతుండేవారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని వాతావరణం ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బలీసింది. డాక్టర్ రాయ్ సలహా మేరకు పటేల్ ఢిల్లీ నుంచి ముంబైకి తరలివచ్చారు. అ సమయంలో జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, వీపీ మీనన్లు ఆయనను పరామర్శించారు.
మెరుగుపడని ఆరోగ్యం
ముంబై చేరుకున్న పటేల్ చాలా బలహీనంగా మారారు. విమానాశ్రయం వెలుపలనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా బిర్లా హౌస్కు తీసుకెళ్లారు. ముంబైలో పటేల్ ఆరోగ్యం మెరుగుపడలేదు. 1950, డిసెంబరు 15న తెల్లవారుజామున 3 గంటలకు సర్దార్ పటేల్ గుండెపోటుకు గురయ్యారు. 9.57 గంటలకు కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే