
న్యూఢిల్లీ: భారతరత్న మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతుండగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరణ్సింగ్కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. తన తాతకు అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై మనవడు జయంత్ చౌదరి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జయంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకున్నారు.
‘భారతరత్న పొందిన నాయకులపై సభలో ప్రస్తుతం చర్చ జరగడం లేదు. ఇప్పుడు జయంత్ ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అనుమతిని మాకూ ఇవ్వండి. మేమూ వినియోగించుకుంటాం. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలి’అని ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఖర్గే వ్యాఖ్యలపై జగదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చరణ్సింగ్ను అవమానించి ప్రతి రైతును బాధపెట్టారన్నారు. ఈ చర్యతో అందరూ సిగ్గుతో తల దించుకోవాలన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ భారతరత్న పొందిన పీవీ నరసింహారావు, చరణ్సింగ్, స్వామినాథన్ ముగ్గురికి సెల్యూట్ చేస్తున్నామన్నారు.