తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వెల్లడి
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు.
శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు.


