10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. | President Kovind, PM Modi Express Condolence On Mumbai Fire Accident | Sakshi
Sakshi News home page

10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..

Mar 26 2021 3:56 PM | Updated on Mar 26 2021 4:20 PM

President Kovind, PM Modi Express Condolence On Mumbai Fire Accident - Sakshi

ముంబై: మహమ్మారి వైరస్‌ బాధితులు ఉన్న సన్‌రైజ్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాండూప్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘క్షమించండి’ అంటూ బాధిత కుటుంబసభ్యులను సీఎం థాకరే కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో వెంటిలేటర్‌పై ఉన్న వారే మరణించారని చెప్పారు. ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం సీఎం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు.

సన్‌ రైజ్‌ ఆస్పత్రిలో మొత్తం 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటిలేటర్‌పై ఉన్న వారు బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో వారంతా అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. దీంతో వారు సజీవ దహనం అయ్యి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గతంలో రక్షణ చర్యలు లేవని ఈ ఆస్పత్రికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు అందించారు. అయినా కూడా ఆస్పత్రి నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement
 
Advertisement
Advertisement