కొలువైన రాజారామ్‌ దర్బార్‌ | Pran Pratishtha of Ram Darbar performed at Ayodhya temple | Sakshi
Sakshi News home page

కొలువైన రాజారామ్‌ దర్బార్‌

Jun 6 2025 6:07 AM | Updated on Jun 6 2025 6:07 AM

Pran Pratishtha of Ram Darbar performed at Ayodhya temple

అయోధ్య ప్రధానాలయం తొలి అంతస్తులో రాజదర్బార్‌ విగ్రహాలకు ప్రాణప్రతిష్టాపన 

పలు ఉపాలయాల్లో కన్నులపండువగా జరిగిన విగ్రహాల ప్రాణప్రతిష్ట 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తొలి పూజలు 

శేషావతార్, శివుడు, గణపతి, హనుమాన్, సూర్య, 

భగవతి, అన్నపూర్ణ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టాపన

అయోధ్య: ఆధ్యాత్మిక నగరి అయోధ్య మరోసారి ప్రాణప్రతిష్ట క్రతువులతో పండుగ శోభను సంతరించుకుంది. భవ్య రామమందిరంగా ఖ్యాతికెక్కిన బాలరామాలయంలో తొలి అంతస్తులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘రాజదర్బార్‌’కు వందలాది మంది పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రాణప్రతిష్టచేశారు. 

లక్ష్మణ, హనుమ సమేత సీతారాములు రాజసింహాసనంపై ఆసీనులైనట్లు చెక్కిన మహాద్భుతమైన విగ్రహాల ప్రాణప్రతిష్టాపనోత్సవ క్రతువును పండితులు గురువారం దిగ్నిజయంగా జరిపించారు. 

కృష్ణశిలతో చెక్కిన రామ్‌లల్లా విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో గత ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా జరగ్గా గురువారం నాటి కార్యక్రమం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో జరిగింది. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ మఠం ప్రధానార్చకుని హోదాలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం అత్యంత శుభప్రదంగా భావించే ‘అభిజిత్‌’ ముహూర్తంలోనే గురువారం ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.  

యజ్ఞమండపంలో పూజలతో మొదలు.. 
ఉదయం 6.30 గంటలకు యజ్ఞ మండపంలో ప్రత్యేక పూజలతో ప్రాణప్రతిష్టాపనోత్సవానికి నాంది పలికారు. 9 గంటలకు హోమం మొదలుపెట్టారు. ఏకధాటిగా గంటలపాటు హోమం చేశారు. తొలుత బాలరామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్‌ విగ్రహాలను ఏర్పాటుచేశారు. సీతారాములు సింహాసనం ఆసీనులై ఉండగా వారికి ఇరువైపులా నిల్చున్న భరత, శతఘ్నులు తన్మయత్వంతో చూస్తున్నట్లు, హనుమ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు, లక్ష్మణుడు మోకరిల్లి ఆరాధిస్తున్నట్లు విగ్రహాలను కొలువుతీర్చారు. 

కిరీటం, స్వర్ణాభరణాలతోపాటు మత్సా్యకృతిలో కర్ణాభరణాలతో మందహాసంతో ఆశీర్వదిస్తున్నట్లు రాజులా రాముని విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాల ప్రాణప్రతిష్ట క్రతువులో సీఎం యోగి స్వయంగా పాల్గొని తొలి పూజలుచేశారు. అన్ని ఉపఆలయాల్లోనూ పూజలు అదే సమయానికి ఆరంభించారు. శేషావతార్, శివుడు, గణపతి, హనుమాన్, సూర్య, భగవతి, అన్నపూర్ణ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా నాలుగు ప్రధాన ఘట్టాల్లో సీఎం యోగి పాల్గొన్నారు. 

అన్ని ఉప ఆలయాల్లో ఒకే ముహూర్తానికి కార్యక్రమం జరిగేలా ఖచ్చితమైన సమయపాలన పాటించారు. అన్ని ఉపాలయాల్లో కెమెరాలు, పెద్ద తెరలను ఏర్పాటుచేసి ప్రధాన పండితులు యావత్‌ కార్యక్రమం ఏకధాటిగా కొనసాగేలా పర్యవేక్షించారు. ప్రధాన ఆలయ తొలి అంతస్తులో శ్రీరామదర్బార్, మందిర కాంప్లెక్స్‌ ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈశాన్య దిశలో శివాలయం, ఆగ్నేయ దిశలో గణపతి ఆలయం, దక్షిణ దిశలో హనుమాన్‌ దేవాలయం, నైరుతి దిశలో సూర్యదేవాలయం, వాయవ్య దిశలో భగవతి దేవీ ఆలయం, ఉత్తర దిశలో అన్నపూర్ణదేవీ ఆలయాలను ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా విచ్చేసిన రుత్వికులు 
‘‘వేద సంప్రదాయాలను పాటిస్తూ కార్యక్రమాన్ని సవ్యంగా పూర్తిచేశాం. దేశవ్యాప్తంగా ప్రముఖులైన రుత్వికులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. గంగా దసరా జరుపుకుంటున్న రోజే ఉపాలయాల ప్రాణప్రతిష్ట జరగడం కొత్త ఆరంభానికి సంకేతం. శతాబ్దాల పోరాటం, ప్రయాసలు, విశ్వాసాలు ఇలా ఫలవంతమవుతున్నాయి’’ అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ట్రస్టీ అనిల్‌ మిశ్రా అన్నారు. ‘‘ రామదర్బార్‌ ప్రాణప్రతిష్టతో మరో చరిత్రాత్మకమైన ఘటనకు అయోధ్య సాక్షీభూతంగా నిలిచింది. 

రామదర్బార్‌ ఇకపై భక్తుల హృదయాల్లో భక్తిభావనను, ఆనందాన్ని మరింత పెంచుతుంది. ప్రజల ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ రాముడి ఆశీస్సులు సదా దేశ ప్రజలపై ఉంటాయి’’ అని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ శ్రీరామదర్బార్‌సహా ఎనిమిది ఆలయాల ఆరంభోత్సవంలో తొలి పూజలుచేసే భాగ్యం దక్కడం నిజంగా నా అదృష్టం. 

ఈ కార్యక్రమం ఏక్‌భారత్‌–శ్రేష్ట భారత్‌కు ప్రతీక. రామచంద్రస్వామి విజయానికి గుర్తు’’ అని కార్యక్రమం తర్వాత సీఎం యోగి తన సామాజికమాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ప్రాణప్రతిష్టాపన పూర్తయింది. రామరాజ్యానికి మరో ముందడుగు పడింది’’ అని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘ గంగా దసరా రోజు ఏదైనా కార్యం ఆరంభిస్తే మహాద్భుతమైన ఫలితాలనిస్తుంది. అందుకే రామాలయ ట్రస్ట్‌ ఈ రోజునే కార్యక్రమానికి ఎంపికచేసింది’’ అని అయోధ్యలోని జ్యోతిష్యుడు పండిట్‌ కల్కిరామ్‌ చెప్పారు.  

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు 
ఒకేసారి పలు ఉపఆలయాల ప్రారంభోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు పెద్ద సంఖ్యల భక్తులు తరలివచ్చారు. ప్రాణప్రతిష్ట సమయంలో భక్తులు ఆనందతాండవం చేశారు. భక్తుల జైశ్రీరామ్‌ నినాదాలు, కీర్తనలు, పాటలు, నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. భక్తజనసందోహంతో అయోధ్య పరిసరాలన్నీ ఒక్కసారిగా పండగ కళను సంతరించుకున్నాయి. 

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి ఘటనల తర్వాత అయోధ్యలో జరుగుతున్న అత్యంత కీలకమైన కార్యక్రమం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. అయోధ్యకు వచ్చే వాహనాలను తనిఖీలుచేశారు. అయితే నూతన ఆలయాల్లోకి భక్తులను ఇంకా అనుమతించలేదు. భక్తుల సందర్శనలపై శనివారం తుది నిర్ణయం తీసుకునే వీలుంది. వీఐపీలకు సైతం అనుమతి లేదని జిల్లా మేజి్రస్టేట్‌ నిఖిల్‌ తుకారామ్‌ పాండే చెప్పారు. తొలుత ప్రధానాలయం తొలి అంతస్తులోని రాజదర్బార్‌లోకి మాత్రమే భక్తులను అనుమతించే అవకాశం ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement