
ఎస్టీల మీద దాడులపై జాతీయ ఎస్టీ కమిషన్ మండిపాటు..
ఈనెల 8న విచారణకు హాజరుకావాలని కలెక్టర్, ఎస్పీలకు సమన్లు
ఎంపీ తనూజ రాణి ఫిర్యాదుపై కమిషన్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది. ప్రభుత్య వ్యవహారశైలి, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఎంపేడులో ఎస్టీల మీద జరిగిన దాడులపై వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
అమాయకులపై దాడులు జరిగినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె కమిషన్కు అందచేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ సంబంధిత కలెక్టర్, ఎస్పీలకు సమన్లు జారీచేసింది. తాము ఈనెల 8న విచారణ నిర్వహించనున్నామని, ఆ విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించింది.