Madhya Pradesh Brick kiln Operator Found Diamond Worth Crore Rupees: రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!- Sakshi
Sakshi News home page

20 ఏళ్ల కల.. ఇటుక బట్టీ ఓనర్‌ అదృష్టం! రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!

Feb 22 2022 2:43 PM | Updated on Feb 22 2022 5:08 PM

MP Brick kiln Operator Found Diamond Worth Crore Rupees - Sakshi

మట్టిలో మరకతమణి.. ఆ వ్యాపారిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడ్ని చేసేసింది.

ప్రయత్నమే కాదు.. అప్పుడప్పుడూ అదృష్టమూ తోడవ్వావలంటారు పెద్దలు. అలా ఓ కుటుంబం శ్రమకు అదృష్టం కలిసొచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది.

మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలో సుశీల్‌ శుక్లా కుటుంబం ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్‌పూర్‌ ఏరియా నుంచి మట్టిని సేకరిస్తుంటుంది ఈ కుటుంబం. ఈ క్రమంలో సోమవారం సుశీల్‌ పేరెంట్స్‌.. మట్టి తీస్తుండగా అందులోంచి వజ్రం బయటపడింది. అది 26.11 క్యారట్ల డైమండ్‌. దానిని నిజాయితీగా అధికారులకు అప్పగించగా.. దాని విలువ కోటిన్నర రూపాయల దాకా ఉండొచ్చని, వేలం వేసినా కనీసం ఒక కోటి 20 లక్షల రూపాయల దాకా రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేసి.. ప్రభుత్వ రాయలిటీ, ట్యాక్సులు పోనూ మిగతాది అది దొరికిన శుక్లాకు అప్పగిస్తామని వెల్లడించారు. విశేషం ఏంటంటే.. శుక్లా ఫ్యామిలీ వజ్రాల కోసం రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోయిండట. దీంతో నిస్సారమైన ఆ ప్రాంతాన్ని ఇటుకల తయారీకి మైన్‌ రూపంలో మట్టి కోసం లీజుకు తీసుకుంది. కానీ, ఇరవై ఏళ్ల తర్వాత అనుకోకుండా ఇలా ఒక రేంజ్‌లో అదృష్టం తగలడంతో ఆ కుటుంబం ఖుషీగా ఉంది. 

రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిన శుక్లా కుటుంబం.. వచ్చే దాంట్లోనూ మొత్తం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే.. ఆ భూమిని మరో ఐదుగురితో కలిసి లీజ్‌కు తీసుకున్నారట. అందుకే వచ్చేదాంట్లో వాళ్లకూ భాగం పంచాలని ఫిక్సయ్యాడు శుక్లా. ఏదేమైనా వచ్చిన డబ్బుతో కొత్త బిజినెస్‌ మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు శుక్లా. 

మధ్యప్రదేశ్‌ రాజధాని బోఫాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పన్నా. 12 లక్షల క్యారెట్ల వజ్రాలకు ఈ ప్రాంతం నెలవై ఉందని అధికారులు చెప్తున్నారు. పైగా గతంలోనూ శుక్లాకు తగిలినట్లే జాక్‌పాట్‌ ఎందరికో తగిలింది కూడా.

Advertisement
 
Advertisement
Advertisement