
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్తలతో నమో యాప్ ద్వారా భేటీ అయ్యారు. ‘ఎనతు బూత్ వలిమయ్యాన బూత్ (నా బూత్ అత్యంత శక్తిమంతమైనది)’ కార్యక్రమంలో పాల్గొని లోక్సభ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి సన్నద్ధతపై వారితో చర్చించారు.
‘‘రాష్ట్రంలో ఘనవిజయమే మన లక్ష్యం కావాలి. బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల ఘనవిజయానికి వ్యూహాలు రూపొందించండి’’ అంటూ కార్యకర్తలను ప్రోత్సహించారు. ‘‘తమిళనాట ప్రచారానికి 15 రోజులే మిగిలింది. కనుక ఓటర్లతో నిత్యం అనుసంధానమై ఉండండి. మన పథకాలను, ప్రభుత్వం సాధించిన ఘనతలను వారికి వివరించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో తన తొలినాళ్ల అనుభవాలను మోదీ వారితో పంచుకున్నారు.