నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు | Lalit Modi Slams Rahul Gandhi Over Repeat Fugitive Comments | Sakshi
Sakshi News home page

నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

Jun 4 2026 11:31 AM | Updated on Jun 4 2026 11:48 AM

Lalit Modi Slams Rahul Gandhi Over Repeat Fugitive Comments

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను “పరారీలో ఉన్న వ్యక్తిని కాదు” అంటూ స్పష్టం చేస్తూనే.. రాజకీయ కారణాలతో కొందరు తన పేరును పదే పదే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కడికీ పారిపోలేదు. భారత ప్రభుత్వానికి నన్ను పట్టుకునే శక్తి ఉంది. నిజంగా కావాలంటే ఎప్పుడో పట్టుకునేవారు. ఇది ప్రభుత్వం సమస్య కాదు, మీడియా సృష్టి” అని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న ‘ఫ్యుజిటివ్’ అనే ముద్రను కూడా ఆయన తిరస్కరించారు.

భారతదేశంలో కేసుల విషయంపై స్పందిస్తూ.. ‘‘నన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలన్న బలమైన కోరిక ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఆ కోరిక కలిగినప్పుడు కచ్చితంగా వాటిని ఎదుర్కొంటా’’ అని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై ఆరోపణలు
లలిత్ మోదీ ప్రధానంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో, పార్లమెంట్‌లో తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రికెట్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా తన పేరును రాజకీయంగా ఉపయోగిస్తున్నారని అన్నారు.

ఐపీఎల్‌ షిఫ్ట్‌ వివాదంలో చిదంబరంపై..
2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించిన విషయంపైనా మోదీ మరోసారి స్పందించారు. అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తనపై ఒత్తిడి తెచ్చారని, టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ, కేంద్ర స్థాయిలో రాజకీయ కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు అందుకు ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. “చిదంబరం నన్ను బెదిరించారు. ఆయన అప్పట్లో హోంమంత్రిగా చాలా శక్తివంతంగా ఉండేవారు” అని కూడా వ్యాఖ్యానించారు.

భారత ప్రభుత్వం ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించేందుకు కట్టుబడి ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ జాబితాలో లలిత్ మోదీతో పాటు విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి. గతంలో లండన్‌లో జరిగిన విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల వీడియోను షేర్ చేస్తూ, “భారతదేశానికి చెందిన ఇద్దరు పెద్ద ఫ్యుజిటివ్స్” అని చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి దారితీశాయి. తర్వాత ఆ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ.. లలిత్‌ మోదీ క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు.

లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లిపోయారు. అప్పట్లో ఐపీఎల్ ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన అలా వెళ్లిపోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ప్రధానంగా యూకేలో నివసిస్తూ, భారత్‌కు తిరిగి రాలేదు. తాను పరారీలో లేనని లలిత్ మోదీ మళ్లీ స్పష్టం చేసినప్పటికీ.. రాహుల్ గాంధీ, చిదంబరం పేర్లతో చేసిన ఆరోపణలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement